తిరగబడుతున్న జనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్!

by Disha Web Desk 2 |
తిరగబడుతున్న జనం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఎమ్మెల్యేలను సమాయత్తం చేశారు. వేడుకల్లో భాగంగా జనంలోకి వెళ్లాలని చేసిన అభివృద్ధిని వారికి వివరించాలని సూచించారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మిల్లర్లు, కొనుగోలు సిబ్బంది తాలు పేరుతో తరుగు తీస్తుండగంతో అక్కడక్కడ ఆందోళనలు చేస్తున్నారు. మరోవైపు డబుల్ ఇండ్ల కోసం నిరసనలు ఎదురవుతున్నాయి. చాలా గ్రామాల్లో మౌలిక వసతులు కూడా పూర్తి చేయలేదు. ఈ నేపథ్యంలో జనంలోకి వెళితే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని మెజార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది.

పల్లెల్లోకి నేతలు

గులాబీ బాస్ ఆదేశాలతో ప్రజాప్రతినిధులంతా పట్నం వీడారు. నియోజకవర్గ బాట పట్టారు. వారికి స్థానిక సమస్యలు తలనొప్పిగా మారాయి. మరోవైపు రైతులు ధాన్యం, మొక్కలు కొనుగోలు చేయాలని రోడ్డు ఎక్కుతున్నారు. సమస్యలను ఎలా పరిష్కరించాలో అర్థం కాక... మరోవైపు ఉత్సవాలను విజయవంతంగా ఎలా నిర్వహించాలో తెలియక సతమతమవుతున్నారు. అసెంబ్లీ ఎన్నికలు గడువు సమీపిస్తున్న తరుణంలో పార్టీ నేతలను కేడర్ను సన్నద్ధం చేసేందుకు పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు. ప్రతి గ్రామంలో 21 రోజులు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని అందుకు ఏర్పాట్లు చేసుకోవాలని ఎమ్మెల్యేలకు గులాబీ బాస్ సూచించారు. అయితే గ్రామాలకు వెళ్తున్న ప్రజా ప్రతినిధులకు మౌలిక సమస్యలు ఎదురవుతున్నాయి. సమస్యలు పరిష్కరించాలని ప్రజల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయి. మరోవైపు ధాన్యం కొనుగోలు చేయాలని, తాలు తేమ పేరుతో తరుగు తీయవద్దని, మొక్కలను పూర్తిగా మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. దశాబ్ద ఉత్సవాలను విజయవంతం చేయకపోతే టికెట్ రాదనే ఆందోళన, మరోవైపు ప్రజలకు సమాధానం చెప్పలేక లోలోన మదన పడుతున్నారు.

అసెంబ్లీ ఎన్నికల ఎఫెక్ట్?

ప్రభుత్వం మౌలిక సమస్యలపై దృష్టి సారించకుండా... కేవలం దశాబ్ది ఉత్సవాల పేరుతో కార్యక్రమాలకు శ్రీకరం చుట్టడంపై ప్రజలు మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన డబుల్ బెడ్ రూమ్ హామీ, నూతన రేషన్ కార్డులు, నూతన పెన్షన్లుమంజూరు చేయకపోవడం, డ్రైనేజీలో సిసి రోడ్లు నిర్మించకపోవడం, మారుమూల గ్రామాలకు నీరు సరఫరా కాకపోవడం తదితర సమస్యలతో ప్రజలు సతమతమవుతున్న వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఉత్సవాల పేరుతో కేవలం సమీక్షలతో కాలయాత్ర చేస్తున్నారే తప్ప ప్రజలను పట్టించుకోవడంలేదని మండిపడుతున్నారు. రైతుల రోడ్లెక్కి నిరసనలు తెలిపిన స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఉత్సవాల పేరుతో గ్రామాలకు వచ్చే అధికారులు ప్రజాప్రతినిధులకు నిరసనలు తప్పేటట్లు లేదు.

Next Story

Most Viewed